gold mine Collapse: మాలిలో కుప్పకూలిన బంగారు గని.. భారీ సంఖ్యలో మరణాలు

gold mine Collapse: మాలిలో కుప్పకూలిన బంగారు గని.. భారీ సంఖ్యలో మరణాలు
  • ‘అక్రమ గోల్డ్ మైన్’ కూలడంతో 70 మందికి పైగా మృతి
  • మృతుల్లో పెద్ద సంఖ్యలో మైనర్లు.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
  • మాలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాదం

మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలింది. ఈ ప్రమాదంలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు. గతవారం జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భయాందోళనల మధ్య సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మాలి జియాలజీ అండ్ మైనింగ్ డైరెక్టరేట్‌ సీనియర్ అధికారి కరీమ్ బెర్తే వెల్లడించారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 

మైనింగ్‌లో పాల్గొన్న చాలామంది చనిపోయారని, వీరిలో అత్యధికులు మైనర్లు ఉన్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ రంగంలో కొన్ని చర్యలు తీసుకురావాల్సి ఉందని బెర్తే అన్నారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో నివసించే మైనర్లు, ప్రజలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. గని కూలిన సమయంలో దాదాపు 100 మంది లోపల ఉన్నారని మాలి ఛాంబర్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు అబ్దులయే పోనా వెల్లడించారు. 

కాగా మాలి బంగారు గనులలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆఫ్రికాలో టాప్-3 బంగారం ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో ఇలాంటి విషాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మారుమూల ప్రాంతాలలో భద్రతా చర్యలను పాటించకుండా, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతుండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉంది. 2021లో బంగారం ఎగుమతుల్లో మాలి వాటా అధికంగా ఉందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌, ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి.