లోకేష్​ను అడ్డుకున్న కోనసీమ పోలీసులు 

తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్  చేయగానే  ఆ విషయం తెలుసుకున్న  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నంద్యాల వెళ్లేందుకు యత్నించారు. దీంతో  ఆయనను కోనసీమలో పోలీసులు అడ్డుకున్నారు. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద రాజోలు సీఐ గోవిందరాజు అడ్డుకున్నారు. సీఐతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని లోకేష్​  ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో నేలపై బైఠాయించి లోకేష్ నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు హైడ్రామా చేస్తున్నారు. అదేమని అడిగితే డీఎస్పీ వస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ వద్దకు కనీసం మీడియాను సైతం రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్ళకూడదా అని పోలీసులను లోకేష్ నిలదీస్తే.. సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. తన వెంట నాయకులు ఎవరూ  రావడం లేదని... కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నానని.. అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ కి నిరసన గా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి లోకేష్ నిరసన తెలుపుతున్నారు.