పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు..
![పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు..](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64ad0f652cbd2.jpg)
- 697బూత్లలో రీపోలింగ్
- భారీగా భద్రతా బలగాల మోహరింపు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో 19 జిల్లాల్లోని 697 ప్రాంతాల్లో (బూత్లలో) పంచాయతీ ఎన్నికల రీ పోలింగ్సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. రీపోలింగ్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఆయా ప్రాంతాల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు భారీగా మోహరించి భద్రతను పర్యవేక్షించారు. హింసకు పాల్పడుతున్న వారిపై పూర్తి నిఘాలో ఉంచారు. జూలై 8న జరిగిన ఎన్నికల సందర్భంగా బెంగాల్లో భారీ హింస చెలరేగింది. హింస నేపథ్యంలో 18 మంది అన్ని పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు మృతిచెందారు. రీ-పోలింగ్ జరుగుతున్న జిల్లాల్లో హింసాత్మకమైన ముర్షిదాబాద్లో అత్యధికంగా 175 బూత్లు ఉండగా, మాల్దాలో 109 బూత్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని 46 మరియు 36 బూత్లలో రీపోలింగ్ జరిగింది. కాగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ రీపోల్.. హింసపై బెంగాల్ గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు. హింస సందర్భంగా రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్షాకు నివేదిక అందజేసి ఆయనతో భేటీ అయ్యారు. రాష్ర్టపరిస్థితులపై ఇరువురి మధ్య పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నికలపై విపక్ష కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్మాట్లాడుతూ.. ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు భయానకంగా ఉన్నాయన్నారు. తాను సహనం, మమత, దృఢ నిశ్చయాన్ని ఆరాధిస్తాను కానీ ఇక్కడ జరుగుతున్న హింసను సహించనన్నారు. ఇది సరైంది కాదన్నారు. హింస ఎన్నటికీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని దిగ్విజయ్సింగ్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హా అధికారులతో నివేదికలు తెప్పించుకున్నారు. హింసాత్మక ప్రదేశాలలో రీపోలింగ్కు నిర్ణయం తీసుకున్నారు.