ఎల్ఎండీ ఆరు గేట్లు తెరిచిన అధికారులు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. మిడ్ మానేరు డ్యామ్ నుండి 32 వేల క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు నుండి 20 వేల క్యూసెక్కుల వర్షం నీరు లోయర్ మానేరు డ్యామ్లోకి ( ఎల్ఎండీ )లోకి వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఎల్ఎండీ ఆరు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. మానేరు వాగు పరీవాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. మత్స్యకారులు, గొర్రెలకాపరులు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్ఎండీ ప్రస్తుత నీటిమట్టం 21 టీఎంసీలు కాగా వరద నీరు మరో రెండు టీఎంసీలు కనుక వచ్చి చేరితే మరిన్ని గేట్లు తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు.