క్రీడాకారులకి ఆర్థిక సహాయం అందజేసిన  ఎస్సై దేవేందర్

క్రీడాకారులకి ఆర్థిక సహాయం అందజేసిన  ఎస్సై దేవేందర్

శాయంపేట,ముద్ర :  జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు ఎస్ఐ దేవేందర్ ప్రయాణ ఖర్చుల కింద ఒక్కొక్క క్రీడాకారులకి 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి చేయూతనిచ్చారు. శాయంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సాయిశృతి  మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న జాతీయస్థాయి రగ్బీ  క్రీడకు ఎంపికైంది. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కే. లహరి ఈనెల 25 నుండి 29 వరకు బీహార్లో జరగనున్న జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడలకు ఎంపికైంది. ఇరువురు క్రీడాకారులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో విషయం తెలుసుకున్న ఎస్సై దేవేందర్ వారి ప్రయాణ ఖర్చులకోసం ఒక్కొక్క క్రీడాకారులకు 2,000 చొప్పున 4 వేల నగదు ఆర్థిక సహాయం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్రీడలలో తర్ఫీదునిచ్చి జాతీయస్థాయికి ఎంపిక అయ్యేలా కృషి చేసిన పిఈటి ఎస్. కరిత ను, హెచ్ఎం శ్రీలతను ఎస్సై అభినందించారు. నిరుపేద క్రీడాకారులకు చేయూతనివ్వడానికి దాతలు ముందుకు రావాలని ఎస్ఐ దేవేందర్ కోరారు.