రాష్ట్రంలో 109 ఇండస్ట్రియల్ పార్కులు

రాష్ట్రంలో 109 ఇండస్ట్రియల్ పార్కులు
  • రూ. కోట్లలో పెట్టుబడులు
  • లక్షల మందికి ఉపాధి 
  • టీఎస్​ఐపాస్ తో అనుమతులు సులభతరం
  • పరిశ్రమల స్థాపనకు బహళ జాతీయ సంస్థల ఉత్సాహం

ముద్ర, తెలంగాణ బ్యూరో : పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతన ఇస్తోంది. ఈ రంగం అభివృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర పురోగతి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపపథ్యంలోనే 109  పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసింది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు మంజూరు నుంచి మౌలిక వసతుల కల్పన, అనుమతుల మంజూరు.. అన్ని ఆన్ లైన్ చేసింది. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండటంతో ఎన్నో బహళ జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇంకా అనేక సంస్థలు తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

  • పరిశ్రమల కోసం1.5 లక్షల ఎకరాలు..

నూతన పారిశ్రామిక వాడల కోసం రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అందులో పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులను సమకూర్చింది.  ఈ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించింది. అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దిన 7,806 ఎకరాల స్థలాన్ని 3,680 సంస్ధలకు కేటాయించింది. ఇక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా 2,63,222 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. చిన్న,-మధ్య తరహా పారిశ్రామిక వేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రామం వద్ద ఎమ్ఎస్ఎమ్ ఈ పథకం ద్వారా 570 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ర్టియల్ పార్కును రూపొందిస్తోంది. ఇక్కడ 4 వేల మంది చిన్న, -మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు రూ.1,200 కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ వ్యాపారాలు ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

  • ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు..

రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఇక్కడ పండిన పంటలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.  రైతులు తమ పంటను మార్కెట్ కు తరలించేందుకు ప్రభుత్వం మెరుగైన రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధర వచ్చే వరకు పండిన పంటను దాచుకునేందుకు గిడ్డంగుల సదుపాయం కల్పించింది. ఇలాంటి పంటలను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలు తెలంగాణలోనే తమ ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా తెలంగాణ రైతులకు మద్దతు ధరలు లభిస్తాయనే సదుద్దేశంతో రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లను అభివృద్ది చేసింది.

  • ఐటీ పరిశ్రమలకు ప్రత్యేక స్థానం

ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఐటీ పరిశ్రమలు సత్తా చాటుతుండడంతో రాష్ట్రంలో టీ-హబ్ ఏర్పాటు చేశారు.  టీ-హబ్ ద్వారా ప్రపంచ ఐటీ సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేదుకు అవసరమైన అన్ని వసతులు, అనుమతులు అందిస్తారు.  టీస్ ఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, అదానీ,  సిటీ ఆర్ఎల్ఎస్, ఎన్ఎక్స్ టీఆర్ఏ తదితర సంస్థలు రూ.33,881 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారికి అవసరమైన తన్ని వసతులు సమకూర్చింది.

  • సులభంగా అనుమతులు..

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగవలసిన అవసరం లేకుండా పారిశ్రామికవేత్తలు తమ కార్యాలయంలోనే కూర్చుని పని ముగించుకునే విధంగా టీఎస్​ఐ పాస్ విధానాన్ని రూపొందించింది. ఆన్ లైన్ ద్వారా అవసరమై సర్టిఫికెట్లను దాఖలు చేస్తే అధికారులు వాటిని వెరిఫై చేసి ఆన్ లైన్ ద్వారా అనుమతులు ఇచ్చేలా ప్రక్రియను సులభతరం చేసింది. ఇందుకోసం నిర్ణీత గడువును కూడా ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 11 మే 2023 నాటికి 23,065 యూనిట్లు అనుమతులు పొంది రూ.2 లక్షల 61 వేల 732 కోట్ల తో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తద్వారా 15 లక్షల 74 వేల 798 మంది ఉపాధి అవకాశాలు పొందారు. మరో 18,587  యూనిట్లు రూ.లక్షా 54 వేల 690 కోట్ల రూపాయల పెట్టబడులతో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతులు పొంది త్వరలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 9 లక్షల,13 వేల,386 మందికి ఉపాధి లభించనుంది.

  • నూతన పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు

రాష్ట్రంలో నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామిక వేత్తలకు టీ-ఐడియా పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలల కొనుగోలులో వారికి రాయితీలు అందిస్తోంది. రెండు వేల కోట్లకు పైబడిన పెట్టబడులతో ప్రారంభించి వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే స్టార్టప్ సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలను అందించనుంది. అలాగే షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు, దివ్యాంగులకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అలాగే నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందు కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ద్వారా కుంటుబడిన 550 పరిశ్రమలకు ప్రభుత్వం ఒక్కో సంస్థకు రూ.10 కోట్ల సాయం అందించి వాటి పునరుద్ధరణకు తోడ్పడింది. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్ధరణకు రూ.154 కోట్లు వెచ్చించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు మరో 105 కోట్లను కేటాయించింది. నష్టాలలో ఉన్న సిర్పూర్ కాగజ్ మిల్ ను పునరుద్ధరించి ఆ పరిశ్రమ ఉద్యోగులను ఆదుకునేందుకు రూ. 87.07 కోట్లు మంజూరు చేసింది.

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానం

పరిశ్రమలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ అనుకూల మైనదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తేల్చిచెప్పింది.  2016లో కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డుల్లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. 2017, 2018 లోకూడా మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. 2020 సంవత్సరం నుంచి ర్యాంకింగ్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం గ్రేడిగ్ పద్దతిని ప్రవేశపెట్టింది.