భార్య తల కోసి చంపిన భర్త

భార్య తల కోసి చంపిన భర్త
  • నిర్మల్ జిల్లాలో దారుణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:కట్టుకున్న భార్యకు భర్తే కాలయముడయ్యాడు. కుటుంబ కలహాలతో భార్య తలను కోసి మొండెం నుంచి వేరు చేసిన దారుణం నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. దిమ్మదుర్తి కి చెందిన సూర నర్సయ్య, సూర లక్ష్మి భార్యాభర్తలు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండడంతో కుటుంబ సభ్యులు నర్సయ్య ను ఇంటికి దూరం పెడుతూ వచ్చారు.

ఇదే సమయంలో తనకు మోటార్ సైకిల్ కొనివ్వాలని నర్సయ్య తన కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. అయితే వారు నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు నర్సయ్య శుక్రవారం రాత్రి మద్యం కొనుగోలు చేసి ఇంటికి తీసుకుని వచ్చాడు. కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. కుటుంబ సభ్యులు నిద్రించే దాకా నర్సయ్య టీవీ చూస్తూ కూర్చున్నాడు. అందరూ నిద్రించాక భార్య సూర లక్ష్మి( 49) తలను పదునైన ఆయుధం తో కోసి మొండెం నుంచి వేరుచేసి ఇల్లు వదిలి పారిపోయాడు. మృత దేహాన్ని చూసిన మృతురాలి కూతురు పెనుగొండ వనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా  నిందితుడు శనివారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు.మృతురాలికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు.