ఉపాధి హామీ నిధులు పెంచండి
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
ముద్ర ప్రతినిధి, నిర్మల్: కేంద్రం ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం వల్ల పూర్తి స్థాయిలో పనులు దొరకకుండా పోయే ప్రమాదం ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొప్పని పద్మ అన్నారు. సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొప్పని పద్మ మాట్లాడుతూ ఉపాధిహామీ నిధులలో కేంద్ర ప్రభుత్వం కోత విధించిందన్నారు. ఇందువల్ల పని దినాలు తగ్గే ప్రమాదముందని అన్నారు.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు రోజుకు 600 రూపాయల కూలితో పాటు 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.గడ్డపార, తట్ట ,పారా కొనుగోలు చేసి ఇవ్వాలని, 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.