పెండింగ్ పనుల్లో వేగం పెంచండి- గంగుల కమలాకర్ | Mudra News

పెండింగ్ పనుల్లో వేగం పెంచండి- గంగుల కమలాకర్ | Mudra News
  • నియోజకవర్గాల  అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు
  • ప్రజలు కోరుకునే విధంగా  అభివృద్ధి పనులు 
  • మంత్రి గంగుల కమలాకర్


ముద్ర ప్రతినిధి, కరీంనగర్​:  కరీంనగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను  మార్చి 31లోగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ  మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.   సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పీఆర్, ఆర్అండ్ బి, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, విద్యుత్ శాఖల  అధికారులు, కరీంనగర్ నియోజకవర్గం లోని ఎంపీటీసీ లు, సర్పంచ్ లు ఇతర ప్రజాప్రతినిధులతో గ్రామాల వారీగా చేపట్టవలసిన,   పెండింగ్ పనుల వారీగా మంత్రి సమీక్షించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.50 కోట్లు మంజూరు చేశారని, వాటిని మార్చి 31లోగా పూర్తి చేసి ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నిధులను మంజూరు చేసుకొని మరింత అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించు కోవాలని తెలిపారు.  ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 80 శాతం పనులు పూర్తి చేసుకోవడం జరిగిందని, మిగిలి ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంచాయతీ రాజ్ నిధులతో  టెండర్లు పూర్తి అయిన పనులు వెంటనే పూర్తి చేయాలి,  మిగిలిన పనులకు అంచనాలు సిద్ధం చేయాలని, పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గం లో రూ.2.80 లక్షలతో మంజూరు చేసుకున్న సంఘ భవనాలను ఫర్నిచర్ తో సహా పూర్తి చేయాలని,   మిగిలిన సంఘ భవనాలకు నిధులు  మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరు చేసుకున్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసుకోవడంతో పాటు   పంచాయతీ రాజ్ రోడ్లన్ని పూర్తి చేయాలని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులకు సమృద్ధిగా నీరు అందించుకుంటూ కరీంనగర్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపామని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి పనులను మొదటి ప్రాధాన్యత గా పూర్తి చేయాలి అన్నారు. విద్యుత్​ లైన్స్ ను సరిచేయాలని,  విరిగిపోయిన స్తంభాలను తొలగించి కొత్తవి అమర్చా లని,  విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.  సమావేశంలో  కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, జెడ్పీ సీఈఓ ప్రియాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జెడ్పీటీసీలు కరుణ, పి.లలిత, అధికారులు, ఎంపీపీ లు లక్ష్మయ్య, శ్రీలత, కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రుద్ర రాజు, కోఆప్షన్ మెంబర్ సాబీర్ పాషా, ఎంపీటీసీ, సర్పంచ్ లు పాల్గొన్నారు.