రహదారి భద్రత ఒక జీవన విధానం: డిటిసి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

రహదారి భద్రత ఒక జీవన విధానం: డిటిసి మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: రహదారి భద్రత నినాదం కాదని మనo అనుసరించాల్సిన జీవన విధానం అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు యూనిఫాం పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాల ను నివారించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భారతదేశంలో సంవత్సరానికి లక్ష అరవై వేల మంది రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్నారని అందులో ఎక్కువ శాతం మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

అధిక వేగంతో, త్రాగి వాహనం నడపడం, విశ్రాంతి లేకుండా వాహనం నడపడం వంటి కారణాలవల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కావున మనమందరము రహదారి భద్రత నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని తెలిపారు.  అంతేకాకుండా  ప్రయాణికులను గమ్య స్థానాలకు  సురక్షితం గా చేర్చాల్సిన బాధ్యత ఆటో డ్రైవర్ల పై ఉందని,వారు డ్రైవింగ్  చేసేటప్పుడు యూనిఫామ్ ధరించడంతోపాటు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ప్రయాణి కుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. అవగాహన  సదస్సులతోపాటు  తనిఖీలు చేపట్టడం ద్వారా, వివిధ శాఖల సమన్వయంతో ఈ రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అందుకు సమాజంలో ప్రతి ఒక్కరము బాధ్యతగా తీసుకోవాలని చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వాహకులు గన్ శ్యామ్, శ్రీనిధి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.