పండగ పూట తీవ్ర విషాదం

పండగ పూట తీవ్ర విషాదం
  • అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
  • ఒకరు వనపర్తి విద్యార్థి

 ముద్ర ప్రతినిధి, వనపర్తి : అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇద్దరూ తెలుగు విద్యార్థులు శనివారం అర్ధరాత్రి నిద్రలోనే మృతి చెందడంతో పండగ పూట ఆయా కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన గట్టు వెంకన్న కుమారుడు గట్టు దినేష్(23), శ్రీకాకుళం కు చెందిన సాయి నికేష్ (23)లు ఇంజనీరింగ్ పూర్తిచేసుకుని ఉన్నత చదువుల కోసం డిసెంబర్ 28వ తేదీన అమెరికాకు వెళ్లి కనెక్టికట్ అనే ప్రాంతంలో రూమును అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆకస్మికంగా రూములో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో నిద్రలోనే మృతి చెందినట్లు అమెరికా నుండి తల్లిదండ్రులకు సమాచారం అందింది.

శనివారం మధ్య రాత్రి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మెగా రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి లోని మృతుని కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి విద్యార్థి మృతి చెందిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశానని, మృతదేహాన్ని వనపర్తికి తరలించేంతవరకు తాను కృషి చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు.