నాకు ఇవే చివరి ఎన్నికలు

నాకు ఇవే చివరి ఎన్నికలు

మీ బిడ్డగా సాదుకుంటారో సంపుకుంటారో మీ ఇష్టం

మానకొండూరు బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్

తిమ్మాపూర్, ముద్ర : జరగబోయే ఎన్నికల్లో నేను మానకొండూరు నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్నానని, బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఊరుకో నాయకుడిని నమ్ముకున్నాయని మానకొండూరు బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ అన్నారు. ఇల్లంతకుంట, తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆరెపల్లి మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నమ్ముకున్న ఊరుకో లీడర్ ఏం చేస్తున్నాడనేది ప్రజలకు అర్థమైందన్నారు. ఊరుకో లీడర్ తన వ్యక్తిగత స్వార్థం, స్వలాభం కోసం ఆరాటపడుతున్నాదు, రాజకీయ పబ్బంగడుపుకుంటున్నారని , ప్రజల కష్టాలు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి నాయకులను ప్రజలు విశ్వసించవద్దని, నేరుగా మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉండే నన్ను జరగబోయే ఎన్నికల్లో ఆచరించాలని కోరారు. రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మీరే , మీ బిడ్డగా నన్ను సాదుకుంటారో చంపకుంటారో మీ ఇష్టమని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

మానకొండూరు నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, నియోజవర్గ సమగ్ర అభివృద్ధి కోసం లక్ష్యం, ఆశయంతో ఉన్న నాకు జరగబోయే ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని కోరారు. నియోజకవర్గానికి జరుగుతున్న చివరి ఎన్నికల్లో చివరి ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్, బి ఆర్ఎస్ పార్టీలవి మోసపూరిత హామీల నీ ప్రజలు వాటిని విశ్వసించవద్దన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తుందని, ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చేపడతామన్న బిజెపికి బీసీ, ఎస్సీ సమాజం అండగా నిలవాలని కోరారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మాజీ జెడ్పిటిసి ఎడ్ల జోగిరెడ్డి, తిమ్మాపూర్ ,ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, సంతోష్, చింతం శ్రీనివాస్ ,బుర్ర నరేష్, సిరిసిల్ల నరసయ్య, అల్లాడి రాఘవేందర్ రావు (చంటి) తదితరులు పాల్గొన్నారు.