స్కాన్ ఐరన్ పరిశ్రమలో బాయిలర్ పేలుడు
- ఏడుగురు కార్మికులకు గాయాలు
- రెండు లారీలు ధ్వంసం
షాద్నగర్ , ముద్ర: స్కాన్ఐరన్ పరిశ్రమలో బాయిలర్ లో పేలడంతో ఏడుగురు కార్మికులు గాయపడ్డారు. అక్కడ ఉన్న రెండు లారీలు ధ్వంసం అయ్యాయి. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలోని బాయిలర్లో పేలింది. ఈ ఘటనలో గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్కాన్ ఐరన్ పరిశ్రమలో ఐరన్ లారీల లోడ్లు అన్లోడింగ్ చేస్తుండగా పేలుడు సంభవించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రెండు లారీలు, ఇతర సామాన్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు. సంఘటన స్థలానికి స్ధానిక ఎస్సై కృష్ణయ్య, అగ్నిమాపక అధికారి జగన్ తదితరులు చేరుకొని క్షతగాత్రులను షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు.