మలుపు తిరిగిన లిక్కర్ కేసు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ.. విచారణకు రావాలని సమన్లు

మలుపు తిరిగిన లిక్కర్ కేసు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ.. విచారణకు రావాలని సమన్లు
  • ఇప్పటి వరకు కేసులో సాక్షిగా ఉన్న కవిత
  • ఇప్పుడు కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ
  • 26న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ ఈ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఈనెల 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ... దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది.  

గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది. ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది. అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత... ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది.