చీమలపాడు లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పర్యటన

చీమలపాడు లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పర్యటన

ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం/కారేపల్లి : బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. శనివారం కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రతి కుటుంబానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు.

ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలన్నారు. కుటుంబాల స్థితిగతులను చూస్తుంటే అంతా పేద, గిరిజన కుటుంబాలకు చెందిన వారేనని సాంబశివరావు తెలిపారు. ఘటన తీరు హృదయవిదారకంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కారేపల్లి మండల కార్యదర్శి బోళ్ల రామస్వామి, నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.