అన్నదమ్ముల మధ్య ఘర్షణ తమ్ముడి పై అన్న కత్తితో దాడి

అన్నదమ్ముల మధ్య ఘర్షణ తమ్ముడి పై అన్న కత్తితో దాడి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో గురువారం అన్నదమ్ముల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలి వానగా మారి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటనలో అన్న గాదగోని రమేష్ కత్తితో తమ్ముడు నరేష్ పై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్తి విషయం, తండ్రి ఒకరి వైపే మద్దతుగా ఉండడం తదితర అంశాలతో ఇరువురి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు ఏర్పడ్డాయని, తాజాగా ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టు చింతకాయ దులుపుతున్న క్రమంలో వివాదం చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడ్డ నరేష్ ను 108 అంబులెన్స్ లో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది వెంకన్న, శ్రీను ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.