ప్రతి గర్భిణీ ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో జరగాలి: కలెక్టర్ రాజర్షి షా

ప్రతి గర్భిణీ ప్రసవం ప్రభుత్వాసుపత్రిలో జరగాలి: కలెక్టర్ రాజర్షి షా
District Collector Rajarshi Shah

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రతి గర్భిణీ మహిళ ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేసుకునేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే  గాక గర్భిణీ నుండి ప్రసవం జరిగే వరకు ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు చేస్తూ ప్రసవం అనంతరం కె.సి.ఆర్. కిట్ తో పాటు ఆడపిల్ల అయితే  13 వేలు, మగపిల్లవాడైతే 12 వేలు ఇస్తూ చిన్నారులకు టీకాలు ఇస్తుందని ప్రజలలో అవగాహన కలిగించి వంద శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులలో జరిగేలా చూడాలని అన్నారు.  సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో  కలిసి  డిప్యూటీ డి.ఏం.అండ్ హెచ్.ఓ. లు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  ప్రతి రెవెన్యూ డివిజన్ లోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేసి వందశాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రులల్లో జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు.

కౌడిపల్లి,పాపన్నపేట, వెల్దుర్తి  లో గత జనవరి నుండి నిర్వహిస్తున్న ప్రసవాలను సమీక్షిస్తూ  ప్రభుత్వాసుపత్రులల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రసవాలు చేస్తారని కాబట్టి గర్భిణిగా ఆసుపత్రిలో పరీక్షించుకున్న  ప్రతి ఒక్కరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేసుకునేలా వారికి, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ సేవలో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉందని, గత నెల 78 శాతం ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగాయని అన్నారు.  ప్రైవేట్ ఆసుపత్రులలో జరుగుచున్న ప్రసవాలపై ఆడిట్ నిర్వహించి అక్కడ  ప్రసవాలు చేసుకోవడానికి గల కారణాలు, గ్యాప్ లు, సమస్యలను విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

102 వాహనం ద్వారా గర్భిణీ ఏ.యెన్.సి. క్లినిక్ కు హెల్త్ చెక్ అప్ కు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రులలో  కాన్పుతో పాటు వెంటనే  ట్యూబెక్టమీ చేయనందున  ప్రైవేట్  ఆసుపత్రులకు వెళ్లుచున్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టవలసినదిగా కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. అదేవిధంగా  సాధ్యమైనంత వరకు సి-సెక్షన్ తగ్గించాలని, ఇన్ఫెక్షన్ రాకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలని  అన్నారు. ఇటీవల జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్ ద్వారా 2డి-ఎకో, ఎక్స్ రే, ఈ.సి.జి. మమోగ్రాం వంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా రెఫెర్ చేసిన కేసుల ప్రగతిని ఫాలో అప్ చేయాలని అన్నారు.

చెక్ లిస్ట్ ప్రకారం డిప్యూటీ డి ఏం అండ్ హెచ్ ఓ లు తమ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ ల ను తనిఖీ చేసి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్నారా , ధరల పట్టిక ఏర్పాటు చేశారా, ఫైర్, ఎలెక్ట్రికల్ వంటి ప్రమాదరహిత చర్యలు తీసుకున్నారా పరిశీలించి దిద్దుబాటును అవకాశం ఇచ్చిన అనంతరం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంటె మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ శివదయాళ్,  డిప్యూటీ డిఎంహెచ్ఓ లు విజయనిర్మల, అనిల, మాధురి, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఏం.సి.హెచ్. సూపర్వైజర్లు తదితరులు  పాల్గొన్నారు.