ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి
- ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి ప్లీనరీ
- ప్రజల భాగస్వామ్యంతో బిఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాలు
- పార్టీ గద్దెలకు రంగులద్దాలి
- పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలి
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలి
- తెలంగాణ పట్ల కేంద్ర మోస పూరిత వైఖరిని ప్రజలకు వివరించాలి
- కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ముఖ్య నేతల, కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మరియు ఎంపీ బడుగుల లింగ యాదవ్ దిశానిర్దేశం
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ప్రజల భాగస్వామ్యంతో అత్యంత నిరాడంబరంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సంబురాలు నిర్వహించాలని జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ఈ నెల 25 న ఆయా నియోజకవర్గ స్థాయి ప్లీనరీ ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కోదాడ మరియు హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలలో ఆదివారం విడివిడిగా నియోజక వర్గ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మరియు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుంబంధ సంఘాల నేతలతో కలిపి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపి బడుగుల మాట్లాడుతూ.....
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సారి ముందుగానే ఏప్రిల్ 25న నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ రోజు నియోజకవర్గాల వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉండేలా గులాబీ మయం చేయాలని సూచించారు. గ్రామ గ్రామాన పార్టీ గద్దెలకు రంగులద్దాలి. జెండాలు ఆవిష్కరించాలి. ఇందులో ప్రజలతోపాటు పార్టీకి చెందిన అన్ని విభాగాల నేతలను, కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలి. అదే రోజు నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీ గొప్ప తనాన్ని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి. అంశాల వారీగా నేతలు ఉప న్యాసాల ద్వారా వివరించాలి అని వారు వివరించారు. అలాగే పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలి. మహిళలు సహా, అనుబంధ సంఘాలను కలుపుకుపోవాలి. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలనీ దిశానిర్దేశం చేశారు..ఈ సమావేశానికి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు విధిగా గులాబీ రంగు చొక్కాలు, మహిళలు గులాబీ రంగు చీరలు ధరించాలని సూచించారు. 25వ తేదీలోగా ప్రతీ గ్రామంలో జెండా గద్దెల నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. 25వ తేదీ ఉదయం అన్ని గ్రామాలు, మండల కేంద్రాలలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తెలంగాణ పట్ల కేంద్ర మోస పూరిత వైఖరిని ప్రజలకు వివరించాలి. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ తీర్మానాలు చేయాలి అని అన్నారు.