టిటిడి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
![టిటిడి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_646b489a49f47.jpg)
- ఆధ్యాత్మిక చింతనతో మురిసిన కరీంనగరం
- గోవిందనామ స్మరణతో పులకించిన నగర వాసులు
- కుటుంబ సమేతంగా హాజరైన మంత్రి గంగుల
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథున లగ్నంలో స్వామి వారి ఆలయానికి భూకర్షణంతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయితే కరీంనగర్ వాసులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకే కరీంనగర్ లో టిటిడి క్షేత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్ లో శ్రీవారి ఆలయానికి భూకర్షణంతో అంకురార్పణ జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా హాజరుకాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్ఛకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యాక్రమాలు నిర్వహించారు.
సోమవారం ఉదయం నుండే టిటిడి ఆలయం నిర్మించే స్థలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్ఛకులు ఆధ్వర్యంలో భూకర్షణ హోమం కలశారాధన అష్టదిక్పాలకుల పూజ మండప పూజ కన్యకాపూజ గోపూజ ముత్తైదువ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్బాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని నవధాన్యాలను వెదజల్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా హాజరు కాగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ కలెక్టర్ ఆర్.వి.కర్ణణ్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ జిల్లా బిఆర్ఎస్ అద్యక్షులు జివి. రామక్రిష్ణారావు మేయర్ సునీల్ రావు నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ లు నాగలిపట్టుకుని దున్నితే ముత్తైదువులు నవధాన్యాలను వెదజల్లారు. అనంతరం మహా పూర్ణాహుతి విశేష ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు.