కామారెడ్డిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం రోడ్ షోలో కేటీఆర్

కామారెడ్డిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం రోడ్ షోలో కేటీఆర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  కామారెడ్డిలో కేసీఆర్ ను గెలిపిస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  కొడంగల్ లో చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డికి కామారెడ్డిలో మూడవ స్థానం దక్కుతుందని  బీఆర్ఎస్ నాయకులను, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్న రేవంత్​రెడ్డికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.  సిరిసిల్ల రోడ్డు నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం, జై ప్రకాశ్​నారాయణ విగ్రహం, పాంచ్ చౌరస్తా, పెద్ద మసీద్ మీదుగా ఎస్ఎన్ గార్డెన్ వరకు రోడ్ షో జరిగింది. నిజాంసాగర్ చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో కేటీఆర్​ మాట్లాడారు.

రైతులకు 3గంటల కరంటు చాలని అంటున్నారని, ఉత్తమ్ కుమారెడ్డి రైతుబంధు దుబారా అని చెప్పాడని పేర్కొన్నారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారంటే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అనే విధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కామారెడ్డి దశ తిరుగుతుందని అన్నారు. కొందరు కేసీఆర్ భూములు గుంజుకునేందుకు వస్తున్నాడని చెబుతున్నారని, తెలంగాణ కోసం తన ప్రాణాన్ని  ఫణంగా పెట్టిన కేసీఆర్, రైతుల భూములు ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు కేసీఆర్ అని, భారతదేశంలోనే తెలంగాణను అగ్రశ్రేణిలో తెచ్చారని కొనియాడారు.

లేనిపోని పుకార్లు లేపుతున్నారని,  నియోజకవర్గంలో ఒక్క ఇంచు భూమి కూడా ఎవ్వరిదీ పోదని అన్నారు. అసైన్డ్ భూములు ఉన్న వారికి పూర్తి హక్కు వారిదేనన్నారు. ఐదేళ్లలో తెలంగాణ దశ పూర్తిగా మారుతుందని స్పష్టం చేశారు. గంప గోవర్ధన్ కేబినెట్ ర్యాంకులో ఉంటారన్నారు.  ఈ ప్రాంతంలో గోదావరి నీరు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే ఇక్కడ కేసీఆర్ రావాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్ ఉద్దిన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, తిర్మల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.