ధాన్యం కొనుగోళ్ళకు వేగవంతం చేయాలి : స్పీకర్ పోచారం
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తడిసిన ధాన్యం కొనుగోలుపై రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా, వేగంగా కాంటాలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఎవరూ భయపడవద్దని రైతులకు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి (BRS ) పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి పోచారం బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి బాన్సువాడ నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యం తరలింపుపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో ఫోన్ వీడియో కాల్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు.