కేయూ వీసీని బర్తరఫ్ చేయాలి
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పల్లా దిష్టిబొమ్మ దహనం
ముద్ర ప్రతినిధి, జనగామ : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ను ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా విభాగ్ కన్వీనర్ చింతకింది సంతోష్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో జనగామలో గురువారం ప్రభుత్వ వర్సిటీలను భ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి పల్లా సన్నిహితుడు కె.యూ విసి మీద ఉన్న శ్రద్ధ కె.యూ విద్యార్థుల మీద లేకపోవడం బాధాకరం అని అన్నారు.
కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులను ఎమ్మెల్సీ పల్లా చొరవతో పోలీసులు తీసుకెళ్లి దాడి చేయడం దారుణమన్నారు. దీనికి నిరసగా విద్యార్థులు 15 రోజులుగా యూనివర్సిటీ లో ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి స్నేహితుడు, అనుభవం లేని వ్యక్తి వీసీ కావడంతో యూనివర్సిటీలు బ్రష్టు పట్టిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, దిష్టిబొమ్మ దహనం చేస్తున్న ఏబీవీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జనగామ జిల్లా కన్వీనర్ తోట హృతిక్ సాయి, పగిడిపల్లి కార్తీక్, పెండ్లి అరవింద్, నవీన్, ఆవుల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.