మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే రఘునందన్రావు సవాల్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. తాను చెబుతున్న రెండు పనులను పూర్తిచేస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 8 ఏళ్లు గడిచినప్పటికీ చెల్లాపూర్ వార్డులో ఇళ్లు లేని నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించలేదని విమర్శించారు. ఈ అంశాన్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంత్రి కేటీఆర్ ఎగతాళిగా మాట్లాడటం బాధకరమని అన్నారు.
దుబ్బాకలో తనను ఓడించడానికి ప్రచారం చేస్తానని మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తనని ఓడగొట్టాడానికి జిమ్మిక్కులు అవసరం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్కు రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వడంతో పాటు.. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. 7.5 లక్షలు మంజూరు చేస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. దమ్ముంటే దుబ్బాకలో ఈ రెండు పనులను పూర్తి చేయాలని సవాలు విసిరారు.