మంత్రి కేటీఆర్ ను అడ్డుకున్న ఎన్ఎస్ యూ ఐ నేతలు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటనకు వచ్చిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. శనివారం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఎన్ఎస్ యూ నాయకులు అడ్డుకున్నారు.
హెలిప్యాడ్ నుంచి భూమారెడ్డి కన్వెన్షన్లో కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రైతులతో ఇంటరాక్షన్ కు కేటీఆర్ వెళ్తుండగా హఠాత్తుగా కాన్వాయి ని కాంగ్రెస్ నాయకులు అడ్డుతగిలారు. ఎదురుగా వచ్చి కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల రక్షణ వలయాన్ని చేధించి కాన్వాయ్ కి అడ్డు రావడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. తేరుకొని అక్కడికక్కడే వారిని ఆరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మంత్రి కేటీఆర్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రతిపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టు చేసిన . కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడం కలకలం రేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకొని కలకలం రేపారు. ఆ సమయంలో అధికారులను బాధ్యులను చేస్తూ వారిపైన శాఖపరమైన చర్యలు కూడా తీసుకున్నారు.