భారీ వర్షాల నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు అవసరం ప్రజలకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ సూచనలు
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి. రఘుమా రెడ్డి విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిధిలోని చీఫ్ జనరల్ మేనేజర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో మంగళవారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సీఎండీ చెప్పిన జాగ్రత్తల ప్రకారం ....వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ లైన్ల కింద , ట్రాన్సఫార్మర్ల వద్ద నిలబడకూడదు. వీలైనంతవరకు వాటికి దూరంగా ఉండాలి. పశువులను, పెంపుడు జంతువులను కూడా విద్యుత్ పరికరాల నుండి దూరంగా ఉంచాలి. -ఎక్కడైనా రోడ్డు మీద, నీటిలో కాని విద్యుత్ తీగలు పడి ఉంటే ఆ తీగలు తొక్కకూడదు. వాటి మీద నుండి వాహనాలు నడపకూడదు. ఎక్కడైనా తీగలు తెగిపడ్డట్టు ఉంటే వెంటనే సమీప విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకు రావాలి. చెట్ల కొమ్మలు, వాహనాలు, భవనాలపై తెగి పడ్డ తీగలు ఉన్నట్లయితే వెంటనే సంస్థకు తెలియజేయాలి.
భారీ గాలులు వీచినప్పడు, వర్షం పడేటప్పుడు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే విద్యుత్ పరికరాలను ఆఫ్ చేసి వెంటనే కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి. విద్యుత్ అంతరాయం ఫిర్యాదుల నమోదు కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించే వినియోగదారులు తమ బిల్లుపై ముద్రితమైన యూఎస్సీ నెంబర్ ను సిద్ధంగా వుంచుకోవాలి.
లోతట్టు ప్రాంతాల్లో, అపార్ట్మెంట్ సెల్లార్ లలో నీళ్ళు చేరితే వెంటనే సంస్థకు తెలియజేయాలి. -
విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. దీనికి తోడు సంస్థ మొబైల్ ఆప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కూడా విద్యుత్ సంబంధిత సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని - సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డి తెలిపారు.