పవిత్ర రంజాన్ మాసంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలి
- జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంభందిత అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. జిల్లాలోని మసీదుల వద్ద పారిశుధ్యం పాటించాలని, మసీదుకు వచ్చే రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని, మసీదు చుట్టు ప్రక్కల ఉన్న వీధిలైట్లు, హైమాస్ లైట్లు వెలగాలని, ఇఫ్తార్ నేపథ్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని , రంజాన్ పర్వదినం నాడు ఈద్గా, మసీదుల వద్ద చెత్త తొలగించే విధంగా ఏర్పాట్లు చేయాలని, వర్షాల నేపథ్యంలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని కలెక్టర్ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ శాఖలను ఆదేశించారు. రంజాన్ మాసం నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఉండే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని, ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్త వహించాలని, రంజాన్ పర్వదినం నాడు మసీదుల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రాత్రిపూట సైతం వాణిజ్య సముదాయాలు తెరిచేందుకు అనుమతించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రంజాన్ నెల సందర్భంగా త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్ లేని ప్రాంతాలలో అదనపు నీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, నీటి సరఫరాలో ఎక్కడా లీకేజీలు, కలుషితం కాకుండా చూసుకోవా లని, విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, రంజాన్ పండుగ నాడు అదనపు పాలు అందుబాటులో ఉండాలని , గ్యాస్ రిఫిల్లింగ్ కొరత రాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు