సిక్సర్ కింగ్ రోహిత్ శర్మ
రోహిత్ ఖాతాలో మరో రికార్డు .. 250 సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీ 250 సిక్సర్లు కొట్టిన తొలి ఇండియన్ బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఏప్రిల్ 22న పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో 27 బంతుల్లో 44 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. మూడో సిక్సర్ కొట్టడం ద్వారా రోహిత్ శర్మ 250 సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
పంజాబ్ బౌలర్ల అర్షదీప్ వేసిన 4వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఓవర్లో శామ్ కరన్ బౌలింగ్ లో కూడా రోహిత్ శర్మ ఓ సిక్సర్ బాదాడు. ఆ ఓవర్ 4వ బంతికి ఓ భారీ సిక్సర్ కొట్టాడు. అదే విధంగా రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్ మూడవ బంతికి కూడా రోహత్ శర్మ సిక్సర్ కొట్టాడు. ఈ సిక్సర్ ద్వారా రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఏప్రిల్ 22న రోహిత్ శర్మ ఆడిన ఐపీఎల్ మ్యాచ్ తన కెరీర్ లో 233వ మ్యాచ్ కావడం విశేషం.
ముంబై పరాజయం
రోహిత్ శర్మ సిక్సర్లు సృష్టించిన ఈ మ్యాచులో ముంబై జట్టు విజయం సాధించలేకపోయింది. పంజాబ్ జట్టు విజయం సాధించింది. 215 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన ముంబై జట్టు లక్ష్యం చేరుకోలేకపోయింది. గెలుపుముంగిట చతికిలపడింది. 201 పరుగులు మాత్రమే చేసింది. 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. చివరి ఓవర్లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరం ఉన్నాయి. తిలక్ వర్మ లాంటి బ్యాటర్ కూడా బరిలో ఉన్నాడు. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ స్పిన్ మాయాజాలంతో మ్యాచును మలుపు తిప్పాడు. 20వ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేశారు. 2 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో వికెట్లు కూడా విరిగిపోయాయి. దీంతో బీసీసీఐకి 24 లక్షల నష్టం వాటిల్లిందని కూడా వార్తలు వస్తున్నాయి.
సిక్సర్ వీరులు.. గేల్, డివిలియర్స్
ఐపీఎల్ టోర్నీలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఘనత క్రిస్ గేల్ పేరిట ఉంది.క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 142 మ్యాచుల్లో ఏకంగా 357 సిక్సర్లు కొట్టి టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. 184 మ్యాచుల్లో 251 సిక్సర్లు సంధించాడు. వారి తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. మరో రెండు సిక్సర్లు కొడితే డివిలియర్స్ రికార్డు బ్రేక్ కానుంది. భారత్ ప్లేయర్లలో రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో ధోని, కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ధోని 235 సిక్సర్లు కొట్టగా, కోహ్లీ 229 సిక్సర్లు బాదాడు.