మెట్రో పనుల్లో వేగం పెంచండి

మెట్రో పనుల్లో వేగం పెంచండి
  • లైన్​విస్తరణకు వెంటనే సర్వే చేయండి
  • అధికారులను ఆదేశించిన మినిస్టర్​కేటీఆర్
  • హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో సమీక్ష 
  • డిపో కోసం 48 ఎకరాలను అప్పగించాలని జీఎంఆర్ వర్గాలకు ఆదేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో: మెట్రో లైన్ ను భారీగా విస్తరించడానికి  అవసరమైన సర్వేలను చేపట్టి ముందు ప్రాథమిక రిపోర్టులు, తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు సిద్ధం చేయాలని మినిస్టర్​కేటీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్ పోర్టు మెట్రో వ్యవస్థపైన గురువారం కేటీఆర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 

  • హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తాం..

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను భారీగా విస్తరిస్తూ, బలోపేతం చేయాలన్న దిశగా ప్రభుత్వం వేగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఆ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని  దిశా నిర్దేశం చేశారు. అంతకంతకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వనగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్​పేర్కొన్నారు. ప్రభుత్వ ఆలోచనల మేరకు ఓవైపు మెట్రో రైల్ విస్తరించే కార్యక్రమాల తాలూకు ప్రణాళికలను సిద్ధం చేస్తూనే ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో అదనపు కోచ్ లు పెంచాలని కేటీఆర్ సూచించారు. 

  • మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాం..

మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీస్ లను ప్రారంభిస్తే ప్రస్తుతం ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ వేతోపాటు ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ పై తమ ప్రణాళికను పవర్​పాయింట్​ప్రజెంటేషన్ తో  వివరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను అనేక సవాళ్లను దాటుకొని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేశామన్నారు. తమ అనుభవాలతో భవిష్యత్​మెట్రో ప్రాజెక్టులను మరింత వేగంగా పూర్తి చేసే సామర్థ్యం తమకు ఉన్నదని తెలిపారు.  ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడుతూ జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్ పోర్టు అథారిటీ వర్గాలు వెంటనే  48 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్, ఎల్బీనగర్ నుంచి నాగోల్ వరకు విస్తరించాలనుకుంటున్న మెట్రో మార్గానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9,100 కోట్ల ఆర్థిక సహాయాన్ని అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తోపాటు పలువురు శాఖధిపతులు పాల్గొన్నారు.

  • కేటీఆర్ తో అక్బరుద్దీన్​భేటీ..

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అక్బర్​కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్ కి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మెట్రో అధికారులు తెలిపారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు ఉన్న ప్రస్తుత ఎయిర్ పోర్ట్​మెట్రో కారిడార్ ను శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు.