ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజాపాలన

ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రజాపాలన
  • రాష్ట్ర వైద్య మంత్రి దామోదర్

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రజలతో మమేకమై పని చేయాలనే ఆలోచనతోనే ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గురువారం మెదక్​ జిల్లా టేక్మాల్​ మండలం చల్లపల్లి, అల్లాదుర్గం మండలం రాంపూర్, రేగోడ్ మండలం లింగంపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన పాల్గొని మహిళలకు అభయహస్తం దరఖాస్తు పారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చిందన్నారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజాపాలనను తీసుకొచ్చామన్నారు. ఆనాడు ఇందిరమ్మ పరిపాలించిన తరహాలోనే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందన్నారు.

ప్రజల సాధక బాధకాలు తెలుసుకొని, భవిష్యత్తులో తెలంగాణ ఏ విధంగా ఉండాలని చర్చించి ఆలోచన చేసి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వాగ్దానం చేయగా ఇప్పటికే రెండు పథకాలను అమలులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రజాపాలనలో  దరఖాస్తులు స్వీకరించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గత 9 సంవత్సరాల నుండి రేషన్ కార్డుల కోసం, ఇండ్ల స్థలాల కోసం ఎంతో మంది ఎదురు చూశారన్నారు. ఈ సమస్యకు ఇక తెరపడనుందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్ల విషయంలో తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మెదక్ జిల్లాలో ఉన్న టేక్మాల్​  మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్​, జెడ్పీటీసీ సభ్యులు సరోజ, సౌందర్య, యాదగిరి, స్పెషల్​ ఆఫీసర్​ సాయిబాబా, సర్పంచ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.