పెద్ద సంక్షోభంలో టెక్ రంగం

పెద్ద సంక్షోభంలో టెక్ రంగం

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం యావత్ టెక్ రంగాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ తాజాగా పేర్కొన్నారు. ‘‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో తలెత్తిన పరిస్థితులను నేను చాలా నిశితంగా గమనిస్తున్నా. టెక్ ప్రపంచంలో ఇది పెద్ద సంక్షోబానికి దారి తీసింది’’ అని ఆయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఈ విషయమై ఇజ్రాయెల్ టెక్ రంగంలోని దిగ్గజాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

కాగా, 2008 తరువాత అమెరికాలో సంభవించిన అతిపెద్ద బ్యాంకింగ్ రంగ వైఫల్యంగా ఎస్‌వీబీ చరిత్రకెక్కింది.  అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్‌గా పేరుపడ్డ ఎస్‌వీబీ ప్రధానంగా టెక్ రంగంలోని స్టార్టప్ సంస్థలపై దృష్టిపెట్టేది.టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్‌కు నిధులు సమకూరుస్తుండేది. అయితే.. పోర్ట్‌ఫోలియో నష్టాలను పూడ్చుకునేందుకు సంస్థలోని 2.25 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను విక్రయించనున్నట్టు గురువారం ఎస్‌వీబీ ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది.  ఇన్వెస్టర్లలో ఆందోళన చెలరేగడంతో బ్యాంక్ షేర్లు కుదేలై పరిస్థితి తలకిందులైంది.