పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి

మోత్కూర్,ముద్ర: పాముకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మోత్కూర్ మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ముక్కెర్ల కుమార్, మమత ల కుమారుడు ఉమేష్ (15) మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. తనను ఏదో కరిచిందని ఉమేష్ తల్లిదండ్రులకు చెప్పగా వారు లేచి చూడగా ఏమీ కనిపించలేదు. ఇల్లంతా వెతకగా గ్యాస్ సిలిండర్ కింద కట్ల పాము కనిపించింది దాన్ని కొట్టి చంపారు. ఇంతలోనే ఉమేష్ తనకు ఏదోలా అనిపిస్తుందని వాంతులు చేసుకున్నాడు.

భయాందోళనకు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారిని లేపి ఉమేష్ ను చికిత్స కోసం ఆటోలో భువనగిరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తల్లిదండ్రులు, పిల్లలంతా కిందనే పడుకుంటున్నారు. ఇంట్లో నుంచి నీళ్లు బయటకు వెళ్లే రంధ్రం లోంచి పాము లోపలికి వచ్చి ఉంటుందని చెబుతున్నారు. మృతుడు ఉమేష్ దత్తప్పగూడెం హైస్కూల్లో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్షలు రాస్తున్నాడు. మమత కుమార్ లకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కాగా ఉమేష్ పెద్ద కొడుకు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.