నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి

నిన్ను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి

మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఎల్​ఆర్​  ఆగ్రహం

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: గౌరవప్రదమైన మంత్రి పదవి లో ఉండి  పిచ్చి చేష్టలు,చిల్లర మాటలతో తన స్థాయిని దిగజార్చుకుంటున్న మంత్రి మల్లారెడ్డిని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ  మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న అసెంబ్లీ ఛాంబర్ లో మంత్రి మల్లారెడ్డి  గతంలో  తనకు  కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించానని తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదని మండి పడ్డారు.  అతను నాకు టికెట్ ఇప్పించడం కాదు గత ఎన్నికల్లో నాకు బీ ఆర్ ఎస్ టికెట్ ఇస్తానంటే నా మనస్సాక్షి  ఒప్పుకోక  వెళ్ళలేదని,  నా పుణ్యాన  మల్లారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని‌ ఎద్దేవా చేశారు. నేను రాజకీయాలలో ఉన్నప్పుడు మల్లారెడ్డి స్కూటర్ పైన కల్తీ పాలు అమ్మే వాడని దుయ్యబట్టారు. 
ఈ సారి ఎన్నికలలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తన శాయ శక్తులా కృషి చేస్తానని  తెలిపారు. మేడ్చల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మంత్రి మల్లారెడ్డిని ఓడించి తీరుతామని  ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం సూచన మేరకే తాను  పని చేస్తున్నానని, తమ  మధ్య  ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. ప్రజలకు సేవచేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, మల్లా రెడ్డి మాదిరిగా డబ్బులు సంపాదించడానికి కాదని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు.