కూలీలపై పిడుగు - ఇద్దరు అక్కడికక్కడే మృతి
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం..
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:కూలి పనికి వెళ్లిన మహిళలు తిరిగి ఇంటికి రాలేదు. ఒక్కసారిగా వచ్చిన వర్షం, పిడుగులు.. ఇద్దరు కూలీలను బలి తీసుకున్నాయి.. చేను వద్దనే ఇద్దరు మృతి చెంది విగతా జీవులుగా పడి ఉండడంతో స్థానికులు విలపించసాగారు.. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన సుమారు ఎనిమిది మంది కూలీలు మంగళవారం శాంతినగర్ శివారులో మిరపనారు నాటేందుకు వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో సమీపంలోని చెట్టు కిందికి వెళ్లారు. చెట్టు కింద సేదదీరుతున్న సమయంలో వారిపై ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. దీంతో చిలివేరు సరిత(30), నేర్పాటి మమత(32) అనే ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పర్లపల్లి భద్రమ్మ, ఆరెపల్లి కొమురమ్మ, మైదం ఉమ, శివ అనేవారికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చిట్యాల హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.