గొప్ప నాయకుడిని కోల్పోయాం..
- పాగాల మృతి పార్టీకి తీరని లోటు
- ఎమ్మెల్యేలు కడియం, పల్లా
- సంతాప సభలో కంటతడి పెట్టిన ప్రజాప్రతినిధులు
ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి ఆకాల మరణం పార్టీ తీరని లోటని, సమాజం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని స్టేషన్ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో సంపత్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, లీడర్లు పాగాల జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తిచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు పాగాల సంపత్ రెడ్డి అకాల మరణం పార్టీకి, తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
పాగాల పార్టీని క్రీయాశీలంగా నడిపించడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. సంపత్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని కడియం, పల్లా భరోసా ఇచ్చారు. ఈ మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎడవెళ్లి కృష్ణారెడ్డి , మున్సిపల్ చైర్మన్ పొకల జమున, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పాగాల సంపత్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.