ఆర్వోబీల నిర్మాణంలో నిర్లక్ష్యం ఎందుకు

ఆర్వోబీల నిర్మాణంలో నిర్లక్ష్యం ఎందుకు
  • నిధులు మంజూరైన పనుల్లో పురోగతి లేదు
  • రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం అసంతృప్తి
  • తొందరగా పూర్తి చేయాలంటూ కేంద్రం లేఖ
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపట్ల కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధులు మంజూరై ఆరు నెలలు దాటినా పనుల్లో పురోగతి లేకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ రహదారులు, రవాణా శాఖ రీజనల్ అధికారి ఎస్.కె.కుశ్వహా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ సహా రాష్ట్రవ్యాప్తంగా 5 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలుపుతూ గత నవంబర్లోనే 432 కోట్ల 84 లక్షల రూపాయలను  మంజూరు చేసింది. నిధులు మంజూరై 6 నెలలు దాటినా ఇంతవరకు నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 11న కేంద్రానికి లేఖ రాశారు. 

ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తీగలగుట్ట సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ ఓబీ) నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల స్థానిక ప్రజల రాకపోకలకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుంది. తొందరగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలుమార్లు అధికారులను కోరుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. కేంద్ర రీజనల్ అధికారి కుశ్వహ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లితో పాటు హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, వికారాబాద్ లలో మంజూరైన ఆర్వోబీల నిర్మాణంలోనూ పురోగతి లేని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం వెంటనే ఆర్వోబీ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. వాస్తవానికి కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి రైల్వే లైన్ క్రాసింగ్ విషయంలో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఆర్వోబీ నిర్మాణం కోసం బండి సంజయ్ కుమార్ ఎంపీ అయినప్పటి నుండి తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకోసం రైల్వే శాఖ మంత్రితోపాటు, రైల్వే బోర్డు ఛైర్మన్, దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులందరినీ కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్వోబీ లేకపోవడంవల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించారు. 

బండి సంజయ్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఆర్వోబీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగా రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 15న కన్సెంట్ లెటర్ కూడా ఇచ్చింది. ఆర్వోబీ ఏర్పాటుకు ఎంత వ్యయం అవుతుందనే దానిపై అధ్యయనం చేసిన అధికారులు దాదాపు రూ.100 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో  80 శాతం వాటా 79.84 కోట్లు  చెల్లించాలంటూ లేఖ రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అనూహ్యంగా యూ టర్న్ తీసుకుంది. ఈ మొత్తాన్ని తాము చెల్లించలేమని, ఆర్వోబీ నిర్మాణాల విషయంలో కేంద్రం కొత్తగా తీసుకున్న విధాన నిర్ణయాన్నే అమలు చేయాలని కోరుతూ మెలిక పెట్టింది. కేంద్ర మంత్రి సహా ఉన్నతాధికారులను కలిసి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన కేంద్రం సేతు భారతం కార్యక్రమంలో భాగంగా 100 శాతం నిధులతో రాష్ట్రంలోని 5 ఆర్వోబీలను నిర్మాణానికి ఆమోదం తెలిపి గత నవంబర్లోనే నిధులు మంజూరు చేసింది. అయినప్పటికీ నేటికీ ఆ నిర్మాణాలను పూర్తి చేయకపోవడంతో బండి సంజయ్ ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో నిర్ణీత గడువులోగా ఆర్వోబీల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది.

Files