రవీందర్ సింగ్ వ్యాఖ్యలు అర్థరహితం
![రవీందర్ సింగ్ వ్యాఖ్యలు అర్థరహితం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64873bfaa2697.jpg)
- మ్యాచింగ్ గ్రాంట్ పై శ్వేత పత్రం విడుదల చేయించాలి
- స్మార్ట్ సిటీ పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు , స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్ పై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ , బిఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా కల్పించిందన్నారు. బండి సంజయ్ కుమార్ కృషితోనే స్మార్ట్ సిటీ కింద నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా స్మార్ట్ సిటీ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని విమర్శించారు. సివిల్ సప్లై చైర్మన్ రవీందర్ సింగ్ కు దమ్ముంటే స్మార్ట్ సిటీ రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ పై శ్వేత పత్రం విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
స్మార్ట్ సిటీ పనులపై ఎప్పటికప్పుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ రివ్యూ చేస్తున్నారని, పలు సందర్భాల్లో నగరంలో పర్యటించి అధికారులకు తగిన సూచనలు చేశారనే విషయం రవీందర్ సింగ్ గుర్తుపెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ స్మార్ట్ సిటీ పనులను నాణ్యత లేకుండా చేపడుతుంది ఎవరని ఆయన ప్రశ్నించారు. రవీందర్ సింగ్ మాట్లాడే ముందు అవగాహనతో మాట్లాడితే మంచిదని, అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేస్తే బిజెపి చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ముందు సివిల్ సప్లై బాధ్యతలు నిర్వహిస్తున్న రవీందర్ సింగ్ ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయం పై రైతుల పంట కొనుగోళ్ల పైదృష్టి సారించాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన పంటకు రైతులకు నేటికి డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే రవీందర్ సింగ్ ఆ విషయాలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.