అన్ని వర్గాలు ఆత్మగౌరవం తో బతకాలి

అన్ని వర్గాలు ఆత్మగౌరవం తో బతకాలి
  • పేదల  జీవితంలో వెలుగులు  నింపిన కేసీఆర్ 
  • 9 ఏళ్లలో అద్భుత ప్రగతి-మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
 శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేకుర్తి శుభం గార్డెన్ లో నిర్వహించిన సంక్షేమ సంబరాలు కార్యక్రమంలో మంత్రి  పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా  104 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్  చెక్కులను, రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 126 గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 9 మంది కులవృత్తులకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా  గంగుల కమలాకర్ మాట్లాడుతూ-1969 నుండి 2014 వరకు తెలంగాణ పోరాటం కొనసాగిందని తెలంగాణ ఆకాంక్షలో న్యాయం ఉంది కనుకనే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాం అన్నారు.  సమైక్య పాలనలో  తెలంగాణ సంపదను కొల్లగొట్టారు. నీళ్లను నిధులు, బొగ్గును దోచుకెళ్లారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని తెలిపారు. కుల వృత్తులకు జీవం పోయాలనే సంకల్పంతో ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయం అందిస్తున్నామన్నారు. వృద్దులకు పెద్ద కొడుకుగా, ఒంటరి మహిళకు అన్నగా, ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా ఆసరైతున్నడని వెల్లడించారు.


కుల వృత్తులకు కొత్త పథకం-బిసి కుల వృత్తుల కుటుంబాలకు కేసిఆర్ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం శుక్రవారం ప్రారంభం అయ్యిందని లబ్ధిదారులంతా దీనిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు. రజక, నాయీబ్రాహ్మణ,అవుసుల,వడ్రంగి,చాకలి,ఆరే కటిక కుటుంబాలకు  చెక్కులు అందజేశారు. రానున్న రోజుల్లో మిగతా కుల వృత్తుల అర్హులైన లబ్ధిదారులకు 1లక్ష రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు.తెలంగాణ లో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో విద్యార్థికి 1లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తూ న్నామని, నాణ్యమైన విద్య, పౌష్ఠిక ఆహారం అందిస్తున్నమని తెలిపారు.

200 కోట్లతో కరీంనగర్ అభివృద్ధి-కరీంనగర్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల నిధులు కేటాయించిందని, నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తుందని ఎట్లున్న ఉన్నా కరీంనగర్ ఎలా మారిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. స్వయం పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు ఇస్తున్నాని అన్నారు.2014లో 1845 మందికి ఆసరా పింఛన్లు ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలో 38,026 మందికి ప్రతి నెల 82 కోట్ల పింఛన్లు ఇస్తున్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ అందిస్తున్నాని వెల్లడించారు.  
 తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేసీఆర్ మాత్రమేనాని అన్నారు. కులవృత్తి పథకం డబ్బులను ప్రతినెల 15వ తేదీన లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. దళిత బందు లాగే ఇది కూడా నిరంతర ప్రక్రియఅని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్  పొన్నం అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెడ్డవేని మధు, బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్  ఆర్డిఓ ఆనంద్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్, ఎమ్మార్వోలు వెంకట్ రెడ్డి నారాయణ సుధాకర్ పలువురు సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.