‘ప్రేమ’ కల్లోలం

‘ప్రేమ’ కల్లోలం
  • కుమార్తె ప్రేమ పెళ్లితో సర్పంచ్​ఆగ్రహం
  • పెళ్లి కుమారుడు, అతడి స్నేహితుల ఇండ్లకు నిప్పు
  • పూర్తిగా దహనమైన సామగ్రి
  • వరంగల్ జిల్లా ఇటకాలపల్లిలో దారుణం
  • పోలీసుల అదుపులో సర్పంచ్​రవీందర్​

ముద్ర ప్రతినిధి, వరంగల్: ప్రేమ పెళ్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటకాలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మండల రవీందర్ కూతురు కావ్యశ్రీ, అదే గ్రామానికి చెందిన రంజిత్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో అవమానం, ఆగ్రహానికి గురైన సర్పంచ్ రవీందర్.. పెళ్లి కుమారుడు రంజిత్ అతడికి సహకరించిన మరో ఇద్దరు స్నేహితుల ఇండ్ల పై బుధవారం దాడులకు తెగబడ్డాడు. ఇండ్లకు నిప్పంటించి సామగ్రిని ధ్వంసం చేశారు. 

ఐదు రోజుల క్రితమే..

జలగం రంజిత్, మండల కావ్యశ్రీ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. కావ్యశ్రీ హసన్​పర్తిలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది. రంజిత్ నర్సంపేటలో వాచ్​మన్ గా చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి వీరు కనిపించడం లేదు. వీరిజాడ కోసం ఆరా తీసిన సర్పంచ్ రవీందర్ కు వీరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. అయితే అప్పటికే పెళ్లి చేసుకున్న కావ్యశ్రీ, రంజిత్​హసన్ పర్తి పోలీస్ స్టేషన్​లో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈక్రమంలో సర్పంచ్ రవీందర్.. తన కూతురిని ఇంటికి రావాలని కోరాడు. అయితే తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, ఎక్కడికా రాను అని కావ్యశ్రీ సమాధానం ఇచ్చింది. దీన్ని అవమానంగా భావించిన సర్పంచ్ రవీందర్.. బుధవారం తన పలుకుబడితో ఇటుకలపల్లిలో వరుడు, అతనికి సహకరించిన ఇద్దరి స్నేహితుల ఇండ్లను బుగ్గిపాలు చేసే ప్రయత్నం చేశాడు. మూడిండ్లలో సామగ్రి పూర్తిగా దహనమైపోయింది. కాగా నిందితులు తమను గుర్తుపట్టకుండా ముఖాలకు మాస్కులు ధరించి వచ్చి దాడులకు తెగబడ్డారు. 

సర్పంచ్ అరెస్ట్.. పికెటింగ్ ఏర్పాటు

ఇటుకలపల్లిలో వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్పందించి సర్పంచ్ మండల రవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో వాతావరణాన్ని చక్కదిద్దేందుకు పోలీసులు పికెట్​ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సర్పంచ్​రవీందర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు నర్సంపేట సీఐ వెల్లడించారు.  

కావ్యశ్రీ సెల్ఫీ వీడియో..

మండల రవీందర్ దాడులకు తెగబడుతుండడంతో ఆయన కూతురు కావ్యశ్రీ స్పందించింది. ‘తాను ఇష్టపూర్వకంగానే రంజిత్ ను ప్రేమించి వివాహం చేసుకున్నానని చెప్పింది. ఇందులో ఎవరి బలవంతం లేదని, ఎవరు కూడా తన గురించి గొడవలకు దిగొద్దని, చావైనా బతుకైనా ఇద్దరం కలిసే ఉంటామని పేర్కొంది. తమకు ప్రాణభయం ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని సెల్ఫీ వీడియోలో తెలిపింది.