బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తును ప్రజలు నిర్ణయిస్తారు: జానారెడ్డి
![బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తును ప్రజలు నిర్ణయిస్తారు: జానారెడ్డి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6426a0ed3b1eb.jpg)
బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం మాజీ మంత్రి జానారెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రాజకీయంగా తమకు తిరుగుండదని బీజేపీ భావిస్తుందని జానారెడ్డి చెప్పారు.ఈ ప్రక్రియలో భాగంగానే బీజేపీ నియంతృత్వంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ తీరును ఇతర పార్టీలు కూడా గమనించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలో బీజేపీయేతర పార్టీలు కలిసి వస్తున్నాయని జానారెడ్డి గుర్తు చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని జానారెడ్డి తప్పుబట్టారు. అదానీ విషయంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్నారు. అదానీ విషయమై పార్లమెంట్ లో చర్చకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదని జానారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ తేల్చి చెప్పారు.