ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కు ఏర్పాట్లు - పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
ఎల్లారెడ్డి/జుక్కల్, ముద్ర : ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ముందస్తుగా రిటర్నింగ్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గురువారం ఎస్పీ సింధు శర్మ తో కలిసి యెల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలలో డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పరిశీలించారు. ముందుగా ఎల్లారెడ్డి లోని జీవదాన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పరిశిలించి ఇందుకోసం ఎంపిక చేసిన ఐదు గదులలో ఉన్న కిటికీలను పూర్తిగా క్లోజ్ చేయాలని అన్నారు. పోలింగ్ ముందు రోజు ఈవీఎం లు , వివి ఫ్యాట్ లు, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ అధికారులకు సక్రమంగా అందించి నిర్దేశించిన వాహనాలలో నిర్దేశిత రూట్ ద్వారాపోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేలా ముందస్తు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పోలింగ్ అయిన పిదప రిసిప్షన్ కేంద్రాలలో చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ అధికారులతో నిర్దేశిత ఫారాలు, ఈవీఎంలు, వివి ఫ్యాట్ లు, మెటీరియల్ ను జాగ్రత్తగా తీసుకొని సరిచూసుకోవాలని, ఎటువంటి తొందరపాటు పనికిరాదని హితవు చెప్పారు.
అనంతరం మద్నూర్ లో ఈవీఎం లు భద్రపరచిన గదిని, డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను పరిశీలించారు. మద్నూర్ తహసీల్ధార్ కార్యాలయాన్ని పరిశీలించి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో సలాబత్ పూర్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ను సందర్శించి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి డబ్బు, మద్యం కట్టడికి ముమ్మర తనిఖీలు చేయాలనీ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు యజ్ఞంలా భావించి పరస్పర సహాకారంతో విధులు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరగకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎల్లారెడ్డి రిటర్నింగ్ అధికారి మన్నె ప్రభాకర్, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.