ఆసియా కప్ -2023 కోసం భారత్ పాకిస్తాన్కు వెళ్లదు
ఆసియా కప్ 2023 వేదికపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ అతిథ్య దేశం కాగా బీసీసీఐ మాత్రం అక్కడికి టీమ్ ఇండియాను పంపేదిలేదని తెగేసి చెప్పేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో ఇప్పటికే చర్చలు జరగగా మార్చిలో మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించేందుకు పాక్ సిద్ధమనే వార్తలు వచ్చాయి. పాకిస్థానే టోర్నీని నిర్వహిస్తూ.. టీమ్ఇండియా మ్యాచ్లను మాత్రం యూఏఈలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇదే అంశంపై పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా ఆసియా కప్ కోసం తమ దగ్గరకు రాకపోతే.. వన్డే ప్రపంచకప్ కోసం భారత్కు వెళ్లకూడదని చెప్పాడు.