ప్రజల డబ్బులతో ఆటలాడుతున్న కేంద్రం 

ప్రజల డబ్బులతో ఆటలాడుతున్న కేంద్రం 

అదానీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కేంద్రం ఆటలాడుతుందంటూ ఆరోపించారు. తన ట్విటర్ ఖాతా ద్వారా కేంద్రంపై కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే కేంద్రం మౌనం ఎందుకు వహిస్తోందని, ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందంటూ ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11శాతం మేర పడిపోవటం పట్ల స్పందిస్తూ కవిత ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు 12లక్షల కోట్లు నష్టపోయిన సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి?  అవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే సంస్థలేనా అని కవిత ప్రశ్నించారు. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి ఆదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. కేంద్రం అప్పుడే జేపీసీ ఏర్పాటు చేస్తే ప్రజలు ఇంత నష్టపోయేవారు కాదని, ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి మరింత నష్టం జరగకుండా చూడాలంటే జేపీసీని నియమించాలని ఎమ్మెల్సీ కవిత కేంద్రానికి సూచించారు.