దశాబ్ది ఉత్సవాలను సక్సెస్ చేయాలి
ముద్ర ప్రతినిధి, జనగామ : రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి, వేడుకలను సక్సెస్ చేయాలని జనగామ కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీసీపీ సీతారామ్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల నిర్వాహన కోసం ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి, రోజు వారి కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లా ప్రగతిపై అన్ని శాఖల అధికారులు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీవోలు సి.హెచ్ మధుమోహన్, కృష్ణవేణి, డీఆర్డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ రామిరెడ్డి, ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, ఎలక్ట్రిసిటీ ఎస్సీ వేణుమాధవ్, డీఏఓ వినోద్ కుమార్, డీఎస్ఓ రోజారాణి, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.