ధాన్యంతో నిండిన మార్కెట్! మళ్లీ నిలిచిన కొనుగోళ్లు

ధాన్యంతో నిండిన మార్కెట్! మళ్లీ నిలిచిన కొనుగోళ్లు

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు సోమవారం 40 వేల బస్తాలకు పైగా ధాన్యం విక్రయానికి రావడంతో యార్డ్ పూర్తిగా ధాన్యంతో నిండిపోయింది. దీనితో సోమవారం విక్రయానికి వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల కాంటాలు తోలకాలు నిర్వహించడానికి మంగళవారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. సోమవారం మార్కెట్ యార్డుకు ధాన్యంతో పాటు మక్కలు, పసుపు విక్రయానికి తెచ్చారు.

ధాన్యం, మక్కలు, పసుపు వ్యాపారులు టెండర్ వేసిన తర్వాత కాంటాలు పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టే అవకాశం ఉందని, దీనితో మంగళవారం కేసముద్రం మార్కెట్ యార్డుకు రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తేకూడదని మార్కెట్ చైర్పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో పేరుకుపోయిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పూర్తిచేసిన తర్వాతే యార్డులోకి కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తామని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు మార్కెట్ పరిస్థితిని గమనించి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావాలని కోరారు.