రేవంత్ రెడ్డి రైతువ్యతిరేకి..!! 

రేవంత్ రెడ్డి రైతువ్యతిరేకి..!! 
  •  స్థాయిని మరిచి మాట్లాడడం తగదు.. 
  •  కాంగ్రెస్ పాలనలో చీకటిరోజులు ప్రజలు మరవలేదు.. 
  •  మంత్రి సత్యవతిరాథోడ్.. 

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:తన స్థాయిని మరిచిపోయి మాట్లాడడం రేవంత్ రెడ్డి కి అలవాటుగా మారిందని, రైతులకు మూడుగంటల విద్యుత్ చాలన్న ఆయనను ఓ..రైతువ్యతిరేకి అని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తుచేసారు.

రేవంత్ రెడ్డికి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం, మాయమాటలు చెప్పడం పరిపాటిగా మారిందని, కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ని ఇచ్చారా అని ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని, కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నడని ఎద్దేవా చేసారు.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రేవంత్‌ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. రైతు ఎన్ని గంటలు నీరు పారిస్తే  ఎన్ని ఎకరాలకు నీరు పారుతుందో రేవంత్ రెడ్డికి కనీస అవగాహన  లేదని, కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు మరిచిపోయి గజినీలా మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.