అధికారుల నిర్లక్ష్యం - ప్రజలకు శాపం
![అధికారుల నిర్లక్ష్యం - ప్రజలకు శాపం](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64ca397e8356f.jpg)
- కొట్టుకుపోయిన చెక్ డ్యామ్
- చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :రామడుగు మండలం వన్నారం వద్ద తెగిపోయిన చెక్ డ్యామ్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి టిపిసిసి అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామడుగు మండలం వన్నారం వద్ద అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యామ్ ను నిర్మించారని ఆరోపించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెక్ డ్యాం నాణ్యత లోపంతో కొట్టుకుపోయిందన్నారు.చెక్ డ్యామ్ తెగిపోవడంతో రెండు వైపులా ఉన్న పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రోజులు గడుస్తున్న చెక్ డ్యామ్ తిరిగి నిర్మించకపోవడంతో రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.అధికారులు వెంటనే స్పందించి నాణ్యతతో కూడిన చెక్ డ్యామ్ ను తిరిగి నిర్మించాలని అన్నారు. నీట మునిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్నారం ఎంపీటీసీ జవ్వాజి హరీష్, వార్డ్ మెంబర్ మహేష్, పైడిపల్లి శ్రీనివాస్, పిండి సత్యనారాయణ, పుల అంజయ్య, పొన్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.