సీపీఐ సీనియర్ నేత పువ్వాడకు అస్వస్థత

సీపీఐ సీనియర్ నేత పువ్వాడకు అస్వస్థత
  • హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలింపు
  • భద్రాద్రి రాలేకపోయిన మంత్రి పువ్వాడ 

ఖమ్మం, ముద్ర: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)సీనియర్ నాయకులు, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు  బుధవారం ఖమ్మంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఖమ్మంలోని తన నివాసంలో అస్వస్థతకు గురైన పువ్వాడకు తొలుత మమత ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆయన కుమారుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.. తన తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు వెంటనే అంబులెన్స్‌లో బుధవారం సాయంత్రం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు అంబులెన్స్‌కు అంతరాయం కలుగకుండా ఆ మార్గంలో గ్రీన్‌ చానెల్‌ను ఏర్పాటు చేశారు. పువ్వాడ నాగేశ్వరరావుకు కిమ్స్‌ వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం వెంటిలేటర్‌పైన ఉంచి పువ్వాడకు చికిత్స అందిస్తున్నారు. దీంతో తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గురువారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం కి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరుకాలేకపోతున్నారు. హైదరాబాద్  ఆస్పత్రిలోనే బుధవారం రాత్రి తండ్రి తోనే మంత్రి ఉన్నారు.