భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి

భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి
  • జీఓ 59 క్రింద లబ్దిదారులకు నోటీసులు జారీ చేయాలి
  • ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
  • కలెక్టర్ లతో విసిలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  నవీన్ మిట్టల్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జిల్లాలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి  నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లను  ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్ లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్ లతో వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59, 76, 118 క్రింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ధరణి లో నూతన ఆప్షన్ లపై సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, రెవిన్యూ అధికారులు ఈ వీడియో సమావేశంలో పాల్గొనగా  రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ, జీఓ 59 క్రింద గతంలో వచ్చిన దరఖాస్తులలో రూ. 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపు చేయని పక్షంలో భవన నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభించాలని ఆయన సూచించారు.  జీఓ 59 క్రింద లక్ష రూపాయల లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసులు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చాలా తక్కువ ధరకు భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకు వచ్చి  చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.  జీఓ 58 క్రింద గతంలో 20 వేల 668 మంది లబ్ధిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండింగ్ ఉన్నాయని, వాటిని రెండు రోజుల్లో పూర్తి చేయాలని  ఆయన సంబంధిత కలెక్టర్ లకు సూచించారు.  భూముల క్రమబద్ధీకరణ కటాఫ్ తేదీని 2 జూన్ 2020 కు పొడిగిస్తూ జీఓ 58, 59 ,76 కింద ప్రభుత్వం మరో మారు దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించిందని, జీఓ 58 కింద 1,20,357 జీఓ 59 కింద 57,661, జిఓ 76 కింద 11, 810  దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు  బృందాలను ఏర్పాటు చేయాలని,  నెలరోజుల వ్యవధిలో  క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. జీఓ 118 కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోగా  పూర్తి చేయాలని అన్నారు. ధరణి మాడ్యూల్ లో పెండింగ్ లో  ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ లకు ఆయన సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం దరణిలో కొత్తగా ఐదు మాడ్యూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతో పాటు చిన్న, చిన్న లోపాలను సవరించడం జరుగుతున్నదని తెలిపారు.  ఆర్.ఎస్.ఆర్ నవీకరణ కోసం ముందస్తుగా 5 ఎకరాల పై ఉన్న 12,546 కేసులను మండలాల వారిగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మిస్సింగ్ సర్వే నెంబర్లు, విస్తీర్ణం సవరణలను ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్ లు పరిశీలించి పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు.

అనంతరం  వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులతో  మాట్లాడుతూ జి.ఓ. 58, 59, 76, 118 క్రింద భూముల క్రమబద్దీకరణకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి త్వరితగతిన పరిష్కరించే విధంగా తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో  ఆర్డీవో మాధురి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, వివిధ మండలాల తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.