వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ... రాయ్‌బరేలిలో రాహుల్.. కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీ... రాయ్‌బరేలిలో రాహుల్.. కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

లోక్‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ మొదలైంది. 543 లోక్ సభ స్థానాలకు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు కౌంటింగ్ చేపట్టారు.ఇక‌ వార‌ణాసిలో బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అటు గాంధీన‌గ‌ర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందంజ‌లో ఉన్నారు. అలాగే నాగ్‌పూర్‌లో నితిన్ గ‌డ్క‌రీ ఆధిక్యంలో ఉన్నారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముందంజ‌లో ఉన్నారు.

రాయ్‌బరేలిలో రాహుల్, అమేథి నుంచి స్మృతి, కోయంబత్తూర్ నుంచి అన్నామలై లీడింగ్
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. ఉదయం గం.8.25 వరకు ఎన్డీయే కూటమి 140 స్థానాల్లో, ఇండియా కూటమి 70 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు.

రాహుల్ గాంధీ రాయ్‌బరేలి, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ముందంజలో నిలిచారు.
అమేథిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. యూపీలోని మెయిన్‌పురి నుంచి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ లీడింగ్‌లో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై లిడింగ్‌లో ఉన్నారు. ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

ఏపీలో కౌంటింగ్ షురూ... కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు, రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 910 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తమ్మీద ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ కూటమి రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ, ఇతర పార్టీలు ఇంకా రేసులోకి రావాల్సి ఉంది.

తెలంగాణలో బీజేపీ దూకుడు... బండి సంజయ్ సహా 5 స్థానాల్లో ముందంజ
తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ ఐదు స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నగేశ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ముందంజలో ఉన్నారు.