విద్యా రంగం అభివృద్ధికి కృషి

విద్యా రంగం అభివృద్ధికి కృషి

                                                                                                                                                                       పత్రిక ప్రకటన

రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్ బుక్స్ ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీసుకున్న గొప్ప నిర్ణయమిదని మంత్రి పేర్కొన్నారు. బుధవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. వర్క్ బుక్స్ ను, నోటు పుస్తకాలను పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను పాఠశాల పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు అందజేయాలని ఆదేశించారు

. గత సంవత్సరం పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం 132 కోట్లు ఖర్చు చేయగా రానున్న విద్యా సంవత్సరానికి గాను 200 కోట్లు వెచ్చించి పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫామ్ ను పాఠశాల పునః ప్రారంభం నాటికి అందేసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్ లను విద్యార్థులకు అందజేసే విధంగా కార్యక్రమాల్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.


శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సూచించారు. పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. మన ఊరు -  మనబడి కార్యక్రమంలో చేపట్టిన పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాఠశాల విద్య సంచాలకులు, శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.